ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్, కరోనా వ్యాక్సిన్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ గురించి ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. కరోనా రోగి తాకిన వస్తువులను ముట్టుకుంటే కరోనా సోకుతుందని, న్యూస్ పేపర్ ద్వారా కరోనా సోకుతుందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చేసిన పరిశోధనల్లో కరోనా రోగులు తాకిన వస్తువులు లేదా పేపర్ ముట్టుకుంటే కరోనా సోకదని తేలింది.
కరోనా సోకిన వ్యక్తిని నేరుగా కలవడం లేదా వారిని కలిసిన ఇతర వ్యక్తులను కలవడం ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. పాజిటివ్ వ్యక్తి తాకిన వస్తువులను తాకితే కరోనా సోకుతుందని చెప్పడనికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. గతంలో ఇదే సంస్థ వస్తువులను తాకడం వల్ల కరోనా సోకవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఆరడుగుల కంటే తక్కువ దూరంలో ఉంటే మాత్రమే కరోనా వ్యాపిస్తుందని తేలింది.
వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు దగ్గడం, తుమ్మడం, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. సీడీసీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనా భారీన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపింది. ఎవరైతే కరోనా లక్షణాలతో బాధ పడతారో వారికి దూరంగా ఉండాలని సూచించింది. కనీసం 60 శాతం ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్ తో తరచూ చేతులు కడుక్కోవాలని చెప్పింది.
టేబుళ్లు, కుర్చీలు, ఫోన్లు, టాబ్లెట్లు, టచ్ స్క్రీన్లు, రిమోట్ కంట్రోల్స్, కీ బోర్డులను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలని టచ్ స్క్రీన్లను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో తుడవాలని సూచించింది. హ్యాండిల్స్, డెస్క్లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రపరచాలని గాలి, వెలుతురు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సీడీసీ ఇచ్చిన నివేదిక గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలామంది వైద్యులు సీడీసీ నివేదిక వాస్తవానికి దగ్గరగా ఉందని చెబుతున్నారు.