భారత్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల విషయంలో ఇటలీ, స్పెయిన్ దేశాలను భారత్ దాటేసింది. ఇటలీ, స్పెయిన్ దేశాలను కరోనా వైరస్ కుదిపేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,624. ఇటలీలో ఈ సంఖ్య 62,752, స్పెయిన్లో యాక్టివ్ కేసుల సంఖ్య 54,768గా ఉంది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా, యాక్టివ్ కొవిడ్ -19 కేసుల విషయంలో భారతదేశం ఐదో స్థానంలో ఉండగా, యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో ఉంది. భారత్లో గత 24 గంటల్లో 5,609 కొత్త కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కోవిడ్ -19 సంఖ్య 1,12,359ను దాటింది. దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కొవిడ్ -19 కేసుల సంఖ్యలో ఇది రెండో అతిపెద్ద రోజువారీ సగటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటివరకు మొత్తం 3,435 మంది మరణించారు.
అలాగే..భారత్లో మార్చి 25 న లాక్డౌన్ ప్రారంభమయ్యే ముందు ఏడు శాతం నుండి కొవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన వారిలో రికవరీ రేటు దాదాపు 40 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు రెండు వారాల్లో రెట్టింపు అయ్యింది. లాక్డౌన్ నాలుగో దశలో మే 6వ తేదీన 49,391గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య గత బుధవారం నాటికి 1,06,139 కు పెరిగింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదట్లో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల కాలానికి విధించింది కేంద్రం. ఆ తరువాత రెండో దశలో మే 3 వరకు, ఆ తరువాత 14 రోజుల మూడో దశకు మే 17 వరకు పొడిగించింది. రెండు వారాల సుదీర్ఘ నాలుగో దశ ఇప్పుడు మే 31 వరకు కొనసాగనుంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో అనేక రంగాల కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి.