కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని మెరుగుపర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశీయ అవసరాలను తీర్చుకుంటూనే అంతర్జాతీయంగా ఎగుమతులకు అవకాశమున్న 12 రంగాలను ఎంపిక చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలుపడం గమనార్హం. భారత్లో ఉత్పత్తి కింద ఈ 12 రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భారత్ తన అవసరాలకు తనపైనే ఆధారపడడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఆహార శుద్ధి, సహజ సాగు, ఐరన్, అల్యూమినియం, కాపర్, ఆగ్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఫర్నిచర్, లెదర్ అండ్ షూ, ఆటో విడిభాగాలు, టెక్స్టైల్స్, కవరాల్స్, మాస్క్లు, శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతులపై కేంద్రం దృష్టిసారిస్తోంది. వీటి విషయంలో భారత్ అంతర్జాతీయ సరఫరాదారుగా అవతరించగలదని మంత్రి చెప్పారు.
ఈ రంగాల్లో భారత్ పోటీ పడగలదని, ఇతర దేశాలతో పలిస్తే మన దేశానికి సానుకూలతలు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్శించి, ఇక్కడ పరిశ్రమలను స్థాపించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందిచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా.. దేశీ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్యూ)ల చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సమావేశం అవుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అమలుకానున్న పలు పథకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరిగే ఈ మీటింగ్లో రుణాల జారీ, తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం బదలాయింపు, మారటోరియం వంటి పలు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలపై ప్రతిపక్షాలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.