ఇంతటి సాకేంతిక యుగంలోనూ దారుణ దురాచారాలు కొనసాగుతున్నాయి. అలాంటి దురాచారానికి సూడాన్ చెక్పెట్టింది. అసలు రాక్షణ దురాచారం గురించి తెలిస్తే మనం షాక్ తినాల్సిందే.. లైంగిక కోరికలు కలుగకుండా ఉండేందుకు బాలికలకు ‘ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ (ఎఫ్జీఎం) టైప్–3’ నిర్వహించే దురాచారాన్ని నిషేధిస్తూ సూడాన్ దేశం మే 1వ తేదీన చట్టం తీసుకొచ్చింది. లాక్డౌన్ కారణంగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆచారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ బాధ్యులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది సూడాన్. సూడాన్లో 87 శాతం బాలికలకు టైపు–3 జెనిటల్ మ్యుటేషన్ చేస్తారట. మహిళల అంగాల్లో లైంగిక వాంఛను ప్రేరేపించే క్లైటోరిస్ను తొలగించడాన్ని జెనిటల్ మ్యుటిలేషన్ అని అంటారు. అందులో టైపు త్రీ అంటే క్లైటోరిస్తోపాటు అంగంలోని ఇరువైపులా ఉండే రెండు పొరలను ‘లబియా మినోరా, లబియా మజోరా’ తొలగిస్తారు. అయితే.. దారుణమైన దురాచారం భారతదేశంలోనూ ఉంది.
భారత్లోని ‘బొహ్రా’ జాతి ప్రజల్లో కూడా ఉంది. ఆ జాతిలో సుమారు ఆరేడేళ్ల వయస్సు వచ్చిన బాలికల్లో 75 నుంచి 80 శాతం ఎఫ్జీఎల్ను నాటు వైద్యం పద్ధతిలో నిర్వహిస్తారు. దీన్ని ‘కఫ్జ్ లేదా కాట్నా’ అని కూడా పిలుస్తారు. భారత్లో దాదాపు 20 లక్షల మంది బొహ్రా జాతి ప్రజలు ఉన్నారు. వారిలో ఇప్పటికీ కొనపాగుతున్న ఈ దురాచారాన్ని నిషేధించాల్సిందిగా ఎన్నో దశాబ్దాలుగా సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయినా భారత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ ఆచారం వారిలో లేదని కొట్టేస్తూ వచ్చాయి. లేనప్పుడు నివారణ చట్టం తీసుకొస్తే వచ్చే నష్టం ఏముందన్న మహిళా సంఘాల ప్రశ్నకు, ఇండియన్ పీనల్ కోడ్, ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ చట్టాలు సరిపోతాయంటూ వాదిస్తూ వచ్చాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఈ దురాచారంపై నిషేధం విధించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలయిన ఓ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లో ఉండడం గమనార్హం.