వైసీపీ సర్కార్ కు వరసగా కోర్టు షాకులు ఎదురవుతున్నాయి. అవి అలా ఇలా కాదు, ఏ నిర్ణయం అయినా కోర్టు పరీక్షకు నిలబడడం, జీవోలకు జీవోలే రద్దు కవడం జరుగుతూంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏకంగా ఒక ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారం కేసు పెట్టే సీన్ ఉందంటే అది అరుదైన సందర్భమే.
అటువంటి ముచ్చట కూడా వైసీపీ సర్కార్ విషయంలో తీరుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. పంచాయతీ భవనాల మీద మూడు రంగులు వైసీపీ పార్టీకి సంబంధించినవి ఉన్నాయని వచ్చిన పిటిషన్ మీద ఆ మధ్య విచారించిన హైకోర్టు ఆ రంగులను తక్షణమే తొలగించమని గతంలో ఆదేశించింది. అయితే వైసీపీ సర్కార్ ఆ మూడు రంగులకు అదనంగా మరో రంగు అంటే మట్టి రంగును కలిపింది. ఆ ఒక్క రంగు వేస్తే వైసీపీ రంగులు అందులో కనిపించవని భావించింది.
ఈ మేరకు 623 జీవోను జారీ చేసింది. అయితే దాని మీద మళ్ళీ కోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. దీన్ని విచారించిన హైకోర్టు జీవో 623ను వెంటనే రద్దు చేసింది. తన తీర్పుని, ఆదేశాలు వైసీపీ సర్కార్ పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారానికి ఇది వస్తుందని కూడా ఘాటుగా వ్యాఖ్యానించినట్లుగా భోగట్టా.
ఈ నెల 28లోగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోతే మాత్రం కోర్టు ధిక్కారం కేసు సుమోటోగా పెట్టాల్సివస్తుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది ఒకవేళ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చే వివరణ ఏంటి, అది కోర్టుకు కనుక సంత్రుప్తి చెందకపోతే జరగబోయే పరిణామాలు ఏంటి అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా వైసీపీ సర్కార్ ఏడాది పాలనలో ఎన్నో రకాలుగా కోర్టు నుంచి షాకులు తగలడం కూడా ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది.