ఇప్పుడు దేశంలో కరోనాతో మనిషికి మనిషికి ఎంతో దూరం పెరిగింది. అంటే సామాజిక దూరమే కాదు.. కాస్త అస్వస్థతగా కనిపించినా అవతల వ్యక్తి కిలో మీటర్ దూరం పరుగెత్తుతున్నారు. మార్చి 24 న ప్రారంభమైన లాక్ డౌన్ వల్ల ఎన్నో శుభకార్యాలు వాయిదా పడ్డాయి. అక్కడక్కడ లాక్ డౌన్ ఉల్లంఘించి పెళ్లిల్లు ఇతర శుభకార్యాలు జరిపిన వారు తర్వాత కరోనా భారిన పడి క్వారంటైన్ పాలయ్యారు. తాజాగా ఓ జంట వివాహానికి హాజరై తర్వాత క్వారంటైన్ పాలయ్యారు. గత వారం రోజుల నుంచి లాక్ డౌన్ సడలింపులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త తరహా కేసులు వెలుగు చూస్తున్నాయి.. పెళ్లి చేసుకుని కాపురానికి సిద్ధమైంది ఓ జంట. కానీ ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది.
కరోనా లక్షణాలతో బాధపడుతోన్న నవ వధువుకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్గా తేలింది.. పెళ్లైన రెండు రోజులకే నవ వధువుకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో, వధూవరుల కుటుంబాలతోపాటు, ఆ పెళ్లికి హాజరైనవారిలో ఆందోళన మొదలైంది. ఇక అసలు విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ భోపాల్లోని జట్ ఖేడి ప్రాంతానికి చెందిన యువతికి రెండు రోజుల క్రితం వివాహం అయ్యింది. అయితే ఈ పెళ్లి అతి కొద్ది మంది సమక్షంలో.. పూర్తిగా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం.. శానిటైజేషన్ వాడి, మాస్కులు ధరించి.. సోషల్ డిస్టెన్స్ అన్నీ సరిగ్గానే పాటించారు.
అయితే పెళ్లి కూతురు అప్పటికే జలుబు, దగ్గు వస్తున్నా.. ఏవో మందులు వేసుకొని కాస్త ఉత్సాహంగానే కనిపించింది. అయితే, పెళ్లి తర్వాత కరోనా టెస్ట్ నిర్వహిస్తే పాజిటివ్గా రావడంతో అంతా షాక్ తిన్నారు. ఇక, అధికారులు వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్లో పెట్టారు. పార్టీలు, శుభకార్యాలకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అధికారులు.