కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రధానంగా ఆయా దేశాల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా కదులుతున్నాయి. భారత్ కూడా ఇదే ప్రయత్నంలో ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కసరత్తు చేస్తున్నారు. స్థానిక పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూనే విదేశీ పెట్టుబడులను ఆకర్శించాలని, అనేక రంగాల నిపుణులతో కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈక్రమంలోనే వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా కేంద్రానికి అనేక సూచనలు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. నిన్న జరిగిన సమావేశంలోనూ మరికొన్ని సూచనలు చేశారు. దేశంలో వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పారు. తమిళనాడులోని తిరుప్పూర్ ఒకనాడు చిన్న గ్రామమని, నేడు అక్కడి నుంచి రూ.40వేల కోట్ల విలువైన వస్త్రాలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో టెక్స్టైల్ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చిన్న దేశాలు ప్రపంచానికి అవసరమైన వస్త్రాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. శ్రీలంక 7 నుంచి 8 శాతం వస్ర్తాలను ఎగుమతి చేస్తున్నదని, ఇండియా నుంచి కేవలం 4 నుంచి 5 శాతం ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయని ఆయన తెలిపారు. అదే చైనా నుంచి 30-40 శాతం వరకు ఎగుమతి అవుతున్నాయన్నాని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ నగరానికి షాంఘై, సిలికాన్ వ్యాలీ సహా ప్రపంచంలోని అనేక ఇతర నగరాలతో పోటీపడే సామర్థ్యం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.