ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ భయపెడుతున్న మహమ్మారి కరోనా. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్.. అనాతి కాలంలోనే దేశదేశాలు విస్తరించింది. ఇక ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు కరోనా కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించాయి. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గడం లేదు.
ప్రపంచ మనుగడను సవాల్ చేస్తున్న కరోనా మహమ్మారి.. అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో కొన్నిదేశాల్లో కరోనా కేసులు మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 52 లక్షలు దాటేసింది. అయితే ఇదే సమయంలో కరోనా గురించి రోజురోజుకు కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నారు. ఇక తాజాగా కూడా కరోనా గురించి మరో భయంకర విషయం బయటకు వచ్చింది. కరోనా సోకి కోలుకున్న వారికి మెడనొప్పి వేధిస్తున్నట్టు ఇటలీలోని ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా’ వైద్యులు గమనించారు. ఇలా మెడనొప్పి రావడాన్ని ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’గా వ్యవహరిస్తారని వైద్యులు వెల్లడించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటలీలో ఓ యువతికి కరోనా సోకి.. ఆ తర్వత కోలుకుని ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికెళ్లిన ఆమెకు మెడనొప్పితోపాటు థైరాయిడ్ గ్రంథి వద్ద నొప్పి వేధించింది. దీంతో పాటు జ్వరం కూడా రావడంతో ఆమె మరోమారు ఆసుపత్రికి వెళ్లింది. అయితే యువతిని పరీక్షించిన వైద్యులు ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. కరోనా వ్యాధి కారకమైన సార్స్ కోవ్2 కారణంగా ఆమెకు ఈ సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్ లట్రోఫా పేర్కొన్నారు. ఎందుకంటే.. వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడిన వారిలో ఇలాంటి సమస్యలు సహజమని వైద్యులు అంటున్నారు. వారు కోలుకున్నప్పటికీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.