మిడతలు.. అందులోనూ డిజెర్ట్ మిడతలు.. కేవలం కొన్ని గంటల్లోనే వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మిడతలు పంటల్ని నాశనం చేస్తాయట. ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉన్న పంటలో సుమారు 40 మిలియన్ల మిడితలు దాడి చేసే అవకాశం ఉన్నది. అంతేగాకుండా.. 35వేల మంది తినే ఆహారాన్ని.. కేవలం ఒక్క రోజులోనే మిడతలు మాయం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. భారత, పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ మిడతలు పెను ప్రమాదంగా మారాయి. ఆ ప్రాంతాల్లో పండుతున్న పంటల్ని మిడతలు పిప్పి పీల్చేస్తున్నాయట.
దీంతో దక్షిణ ఆసియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాల్లోనూ వ్యవసాయం దెబ్బతిన్నది. ఇప్పుడు డెజర్ట్ మిడతల దాడితో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయితే ఇప్పటికే పాకిస్థాన్లో పంటల్ని మిడతలు మింగేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ సాయం చేసేందుకు రెడీ అవుతోంది. ఆఫ్రో-ఏషియా ప్రాంతాల్లో విస్తరిస్తున్న ఈ మిడతలను నివారించేందుకు పాక్, ఇరాన్తో భారత్ పనిచేయనున్నది. మిడతల నియంత్రణ కోసం బోర్డర్ ప్రదేశాల్లో మాలాథియాన్ క్రిమిసంహారకాన్ని పాకిస్థాన్కు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నది.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ మీదుగా మిడతలు ఇప్పటికే రాజస్థాన్లోని జోద్పూర్కు చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా... కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో భారతదేశం తనను తాను కాపాడుకుంటూనే అనేక దేశాలకు సాయం అందిస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బ్రిటన్ ఇలా అనేక దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసెటమాల్ మాత్రలను అందించి మంచి మనసున్న దేశంగా ప్రపంచానికి చాటి చెప్పింది. అనేక దేశాలకు ప్రాణ మిత్రుడిగా నిలిచింది. తాజాగా దాయాది పాకిస్థాన్ కూడా స్నేహ హస్తం అందించడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్తాన్లో పంటలను మిడతల బారి నుంచి కాపాడేందుకు భారత్ సాయం అందించడం గొప్ప విషయమని పలువురు నిపుణులు మెచ్చుకుంటున్నారు.