ఆకలి తీర్చే రైతన్నకు ఎలాంటి కష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి తగ్గట్టుగా వ్యవసాయ పరిణితి సాధించేందుకు సుదీర్ఘ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెబుతోంది. దీనిపై ఇటీవల ఎక్కువగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా సాగు జరగాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయం పరిణితి సాధించడానికి స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా,  వేసిన పంటంతా పూర్తిగా అమ్ముడయ్యే విధంగా తెలంగాణలో పంటసాగు జరగాలంటున్నారాయన.  అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నిపుణులతో సమావేశమై చర్చించారు. 

 

రైతు పండించిన పంట యధావిధిగా ప్రస్తుత మార్కెట్లో అమ్ముతున్నారని... అలా కాకుండా దానికి వాల్యూ యాడ్‌ చేస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందన్నది ప్రభుత్వ మాట. అందుకేపెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతోంది. వాటికి కావాల్సిన ముడి సరుకు నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం సాగాలని... నాణ్యమైన సరుకు తయారీతో తెలంగాణ బ్రాండ్‌కు  ఓఇమేజ్ ఏర్పడుతుందన్నారు కేసీఆర్‌. 

 

రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేటట్టు చేస్తే ఇటు పారిశ్రామిక, సేవా రంగాలు కూడా విస్తరిస్తాయని లెక్క కడుతోంది అలాగే ప్రభుత్వం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంట మార్పిడి కూడా జరగాలని... ఇదంతా రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలని సూచించారు కేసీఆర్‌. 

 

వ్యవసాయంలో మార్పులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం...  సంస్కరణలు వెంటనే అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోంది. దీనివల్ల ఖచ్చితంగా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి. మొత్తానికి కేసీఆర్ రైతును రాజు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: