ఆఫ్ఘనిస్తాన్..నిత్యం బాంబులతో మోతతో దద్దరిల్లే దేశం. ఇప్పుడు ఆ దేశం కరోనా మహమ్మారి రూపంలో మరో ముప్పును ఎదుర్కోంటోంది. ఇక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. మూడున్నర కోట్ల జనాభాకు 400 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో తమ దేశ పౌరుల ప్రాణాలు కాపాడుకోవటం కోసం యువతులు నడుం బిగించారు. *ఆఫ్ఘన్ డ్రీమర్స్* పేరుతో రంగంలోకి దిగారు. సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్న ఈ యువకెరటాలు రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల విలువైన వెంటిలేటర్లను రూ.45 వేలలోపు ధరకే అందిస్తామని ప్రకటించారు. కారు మోటర్, బైక్ చైన్ డ్రైవ్తో వీటిని తయారు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఈ బృందంలోని అమ్మాయిలంతా 14 నుంచి 17 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం.
టయోటా కారులోని మోటార్ను, హోండా మోటార్ సైకిల్లోని చైన్ డ్రైవ్ను ఉపయోగించి ఓ వెంటిలేటర్ నమూనాను తయారు చేశారు. ఇది శ్వాసకోశ రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తుందట. అయితే.. కరోనా వైరస్ కట్టడికి ఆఫ్ఘనిస్తాన్లో కూడా లాక్డౌన్ కొనసాగుతున్నది. దీంతో నగరంలోని అన్ని దుకాణాలూ మూసి వేయడంతో, ఈ వెంటిలేటర్కు కావల్సిన విడిభాగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు ఈ అమ్మాయిలు. అయినా పట్టుదలతో దాదాపు 70శాతం పనిని పూర్తి చేశారు. త్వరలో ఆ వెంటిలేటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారట ఈ అఫ్గాన్ డ్రీమర్స్.
ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖకూడా వీరికి చేయూతను అందిస్తున్నది. ఈ నెలాఖరుకు వెంటిలేటర్లను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై దేశంలోకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ను కాపాడేందుకు భారత్ కూడా సాయం అందించింది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసెటమాల్ మాత్రలను అందించింది.