హైదరాబాద్ అంటే విందులు, వినోదాలు, పార్టీలు, సెలబ్రేషన్స్కు సుపరిచిత చిరునామా. చిన్న సంతోషమైనా..విందులు, వినోదాలు, సరదాలు, కాలక్షేపాలు, ఫంక్షన్లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లి తమ ఆనందాలను పంచుకుంటారు. కానీ కరోనా రాకతో ఆ లోకం దూరమైంది. కొంచెం ఇష్టం.. ఇంకొంచెం కష్టంగా అనిపించేలా మార్పులు వచ్చాయి. ఆ మహమ్మారి తాకిడికి మనుషుల జీవన చిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఒక రకమైన జీవనశైలికి అలవాటు పడ్డ ప్రజలకు లాక్ డౌన్ సడలింపు పెద్ద చాన్స్ ఇచ్చింది. దీంతో, ఇప్పుడు మరోమారు దావత్ల బాట పట్టారు. కానీ... బీ కేర్ఫుల్ అని అంటున్నారు నిపుణులు.
కరోనా లాక్ డౌన్ మార్గదర్శకాలు సడలించినప్పటికీ, మన దైనందిన వ్యవవహాలు తిరిగి పట్టాల ఎక్కినప్పటికీ...తెల్లారి లేచింది మొదలు నిద్రించే వరకు కరోనా దరి చేరకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ సడలింపులతో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనాతో నగర కల్చర్ మొత్తం మారిపోయింది. ఇప్పటికే నిత్యావసర సరుకులు విక్రయించే మాల్స్, దుకాణాల్లోకి మాస్కు లేనిదే అనుమతించడం లేదు. చేతులు తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి. వివిధ సంస్థల కార్యాలయాలు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాయి. మద్యం దుకాణాల వద్ద మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు ఇలా ప్రతిచోట కొత్త మార్గదర్శకాల ప్రకారం నగరవాసులు నడుచుకుంటున్నారు. త్వరలో తెరుచుకునే సినిమా థియేటర్లు, బడా షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో కూడా కొత్త రకమైన మార్పులు రానున్నాయి.
మొత్తంగా ఏ పండుగ అయినా... షాపింగ్ అయినా గుంపులు గుంపులుగా వచ్చి సంతోషంగా జరుపుకోవడం ఆనవాయితీ కానీ ఇకముందు ఆ పరిస్థితులు ఉండవనే విషయాన్ని మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షాపింగ్ చేయాలన్నా.. నలుగురి స్నేహితులతో వెళ్లే సమయంలో అయినా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిని లోపలికి అనుమతిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. ఆ ప్రకారం నడుచుకోవాలి.