ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా తన ఉనికి కోసం ఎన్నో పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పాట్లు ఉనికి పాట్లో.. కునికి పాట్లో కూడా చెప్పలేని పరిస్థితి. అసలు గత ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇప్పటకీ ఈ ముసలి కాంగ్రెస్కు సోనియా గాంధీనే దిక్కన్నట్టుగా ఉంది. ఆ రాహులుడికేమో వ్యూహాలు తట్టవు. చివరకు మొన్న ఎన్నికల్లో కంచుకోట లాంటి అమేథీలో తాను స్వయంగా ఎంపీగా ఓడిపోయాడు. ఏదో వయనాడ్లో పోటీ చేయబట్టి పరువు దక్కి ఇంకా లోక్సభలో అయినా ఉన్నాడు.
కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవేవి సక్సెస్ అయ్యేలా లేవు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా రోజు తర్వాత కొన్ని వ్యూహాలతో మోడీకి సరికొత్తగా చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకప్పుడు మైనార్టీలు, ఎస్సీలు.. ఎస్టీలు కాంగ్రెస్కు గంపగుత్తగా ఓట్లేసేవారు. అయితే కాల క్రమంలో ఈ ఓటు బ్యాంకు అంతా చెల్లా చెదురు అయిపోయింది. అదేం ట్విస్టో గాని బీజేపీ హిందూత్వ ఎజెండాతో ముందుకు వెళుతున్నట్టే ఉన్నా.. యూపీ లాంటి చోట్ల ఒక్క ముస్లింకు సీటు ఇవ్వకపోయినా కూడా తిరుగులేని ఘనవిజయాలు సాధిస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి తన సంప్రదాయ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల వలస కార్మికుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా వ్యవహరించింది. వీరిని తమ స్వస్థలాలకు తరలించే ఖర్చు అంతా కాంగ్రెస్ భరిస్తుందని చెప్పింది. ఇక వలస కార్మికుల దగ్గరకు వెళ్లి మరీ రాహుల్ గాంధీ వారితో మాట్లాడారు. వలస కార్మికుల్లో సహజంగానే వెనక బడిన వర్గాలు అయిన ఎస్సీ.. ఎస్టీలు.. మైనార్టీలు ఉంటారు. ఈ చర్యలు కాంగ్రెస్ పట్ల సానుభూతికి కారణమయ్యాయి.
ఇక కేరళతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకులో తిరిగి కాంగ్రెస్ పట్ల సానుకూల ధృక్పథం కనిపిస్తోందని తాజా సర్వేలు చెపుతున్నాయి. ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేయాలంటే కాంగ్రెస్ ప్రియాంక కు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తే అది ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా ఉన్న యువతలోనూ.. ఆ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకులోనూ మళ్లీ ఆ పార్టీకి ప్లస్ అవుతుందని.. మోడీని ఖచ్చితంగా నిలువ రించవచ్చని జాతీయ, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.