కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ఎక్కడో చైనాలోని వూహాన్లో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతకర వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ క్రమంలోనే లక్షల మంది ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది. మరియు ఎందరినో ముప్ప తిప్పలు పడుతోంది. కరోనా వైరస్ మనుషుల శరీరంలోకి ప్రవేశించి యుద్ధం చేస్తోంది. రోజురోజుకూ తనను తాను అభివృద్ధి చేసుకుంటోంది. కరోనాతో బాధపడే వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచిస్తున్నాయి.
అయితే కరోనా ప్రపంచంపై దాడి మొదలు పెట్టి ఐదు నెలలవుతున్నా దాని తీరు అంతు చిక్కడం లేదెందుకు? అసలు మనిషికి కరోనా భయం నుంచి విముక్తి ఎప్పుడు..? అన్నవి ప్రశ్నార్థకంగానే మారిపోతున్నాయి. ఇక ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య మూడున్నర లక్షలకు చేరవ అవుతోంది. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే ఇదే సమయంలో కరోనాకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు రావడంతో.. ప్రజలను మరింత భయపెడుతోంది. తాజాగా కరోనా గురించి ఓ భయంకర విషయం వెలుగులోకి వచ్చింది. పురుషుల వీర్యంలో కరోనా వైరస్ తలదాచుకుంటున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.
చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. చైనాలోని హెనన్ ప్రావిన్స్లోని షాంఘ్క్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొంత మంది కరోనా రోగుల వీర్యాన్ని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. శరీర రక్షణ వ్యవస్థను తట్టుకొని.. వృషణాలు, కళ్లు, పిండం భాగాల్లో వైరస్ బతుకుతోందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు, కరోనా వైరస్ నుంచి కోలుకున్నా.. మూడేళ్ల వరకు కూడా ఆయా భాగాల్లో వైరస్ జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. అలాగే సెక్స్ చేసినప్పుడు భాగస్వామికి సోకే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి కచ్చితమైన ఆధారాలను కనుగొనాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.