కరోనా వైరస్ కారణంగా అన్నిరంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారత దేశంలో ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు పూర్తిగా పడిపోయాయి. ఇలా పసిడి దిగుమతులు పడిపోవడం వరుసగా ఇది ఐదో నెల కావడమని నిపుణులు అంటున్నారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశ వాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు రూ.21 కోట్లకు అంటే 28.3 మిలియన్ల డాలర్లకు పడిపోయాయి. అయితే.. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం గతేడాది ఇదే సమయంలో రూ.29,775 కోట్ల (3.97 మి. డాలర్లు) విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది. అంటే ఈ గణాంకాలను బట్టి దిగుమతులు దాదాపుగా వంద శాతం పడిపోయాయని అంటున్నారు విశ్లేషకులు.
గత ఐదునెలలుగా బంగారం దిగుమతులు పడిపోవడంతో దేశీయ వాణిజ్యలోటు 15.33 బియిలన్ డాలర్ల నుంచి 6.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తుంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసినప్పటి నుంచి అంటే గతేడాది డిసెంబర్ నుంచి దేశంలో బంగారం దిగుమతులు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. దేశంలో బంగారం దిగుమతులు ఏడాదికి 800 టన్నుల నుంచి 900 టన్నుల మధ్య ఉంటుంది. కానీ ఏప్రిల్లో ఇది 98.74 శాతం పడిపోయి 36 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్డౌన్లో ఉండడం.. అంతర్జాతీయంగా రాకపోకలు నిలిచిపోవడం, దేశాల మధ్య సరిహద్దులు మూసివేయడం.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనే బంగారు దిగుమతులు పడిపోయాయని విశ్లేషకులు అంటున్నారు.
అయితే.. భారతదేశంలో వందశాతం షాపులన్నీ మూసివేసి ఉన్నాయి. దీంతో దిగుమతులు లేవు.. అమ్మకాలు లేవు. అయితే.. కొద్దిరోజులుగా లాక్డౌన్ సడలింపులతో అన్నిరంగాల కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా కొంత సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ బంగారు దిగుమతుల్లో వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.