ప్రస్తుతం భారత దేశంలో కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. మార్చి 24 న కరోనా వ్యాప్తి అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు అక్కడే ఇరుక్కుపోయారు. దాంతో కొంత మంది తమ స్వస్థలం చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొంత మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం వారికి స్వస్థలాలకు వెళ్లుందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే ఆప్పటి నుంచి వరుసగా కోట్ల మంది వలస కార్మికులు తమ స్వస్థలానికి చేరుకుంటున్నారు. లాక్ డౌన్ ముగిశాక వలస కార్మికులు తిరిగి తమ ఉపాధి ప్రాంతాలకు వెళతారా లేక స్వస్థలాల్లోనే ఉండిపోతారా అనేదానిపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏ రాష్ట్రమైనా ఉత్తరప్రదేశ్ వలస కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల పాత్రే కీలకం. కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడ చూసినా విపత్కర పరిస్థితి నెలకొన్న తరుణంలో యూపీలో ప్రత్యేకంగా వలస కార్మికుల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోనే వారికి ఉపాధి కల్పించేందుకు ఈ కమిషన్ సాయపడుతుందని వెల్లడించారు.
యూపీ కార్మికుల పట్ల ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరే అందుకు కారణమని అన్నారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో 20 లక్షల మంది వలస కార్మికులు యూపీకి తిరిగొచ్చారని భావిస్తున్నారు. యూపీలోని మానవ వనరులను ఏ రాష్ట్రమైనా కోరుకుంటే వారికి బీమా సౌకర్యంతో పాటు సామాజిక భద్రత కూడా కల్పిస్తామని, కానీ మా అనుమతి లేకుండా ఏ రాష్ట్రం కూడా ఇక్కడివాళ్లను తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.