ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదురుతూనే ఉంది. కొద్ది నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు సంపూర్ణంగా గోదావరి నీటిని వినియోగించుకునేందుకు సంయుక్తంగా కలిసి ప్రాజెక్టుల కడతామని మరియు సముద్రంలోకి పోతున్న నీటి జలాలను వృధా పోనివ్వకుండా ఇరు రాష్ట్రాలు వినియోగించుకుని రైతుల కష్టాలు తీరుస్తామని జగన్ మరియు కేసీఆర్ లు సంయుక్తంగా రెండు సార్లు భేటీలు నిర్వహించుకుని మరీ వెల్లడించారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఒక మాటపై నిలబడతాయి.... ఒకే సారి దారిలో వెళ్లి రైతుల కష్టాలు తీరుస్తాయని అంతా భావించారు.
కట్ చేస్తే.... ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలపై మౌనం వహించాయి. ఈలోపల అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నఫలంగా 203 జీవోను విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం రాయలసీమకు నీరు అందించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడంతోపాటు దానికి సంబంధించిన కాలువల విస్తరణ చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాయలసీమ ప్రాంతం మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అధిక మొత్తంలో జలాలను తరలించవచ్చు.
ఇది కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. తెలంగాణ విపక్షాలు కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచితే తెలంగాణలో పొలాలు ఎండిపోతాయి అని విపరీతంగా విరుచుకుపడ్డారు. అయితే ముందుగా కేసీఆర్ ఈ విషయంలో మౌనం వహించిన తర్వాత తన స్వలాభం కోసం మరియు రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకే వ్యూహాత్మకంగా దీన్ని వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా జగన్ ప్రభుత్వం ముందు సైలెంట్ గా ఉంటే పనులు జరగవని నిర్ణయించుకున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కి పరోక్షం గా చెక్ పెట్టాలని కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో జగన్ కు అందరిముందు ఓపెన్ ఛాలెంజ్ విసిరినట్టు అయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే కృష్ణా నీటిని మరింతగా తెలంగాణలోకి ఎత్తిపోసుకునేందుకు వీలుగా జూరాల దగ్గర ప్రాజె క్టు కొత్తగా నిర్మించాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో దుమ్ముగూడెం వద్ద ఎత్తు పెంచి ఏపీ ప్రభుత్వం భావిస్తున్న పోతిరెడ్డిపాడుకు పరోక్షంగా చెక్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. కృష్ణా బోర్డు కేటాయించిన నీటి కేటాయింపుల మేరకే తాము పోతిరెడ్డి పాడు ఎత్తు పెంచుతున్నామని చెబుతున్న జగన్ ప్రభుత్వ వాదన కూడా సమర్ధనీయంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇలా పంతాలకు వెళ్లడం ఏ మేరకు సమంజసమని అంటున్నారు.