ఏపీలో విపక్ష టీడీపీలో పూర్తి నైరాశ్యం అలుముకుందా ? గత రెండు నెలలుగా పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ హైదరాబాద్ లో లాక్ అయిన విషయం తెలిసిందే. ఏపీలో ఓ వైపు కరోనా.. మరో వైపు రాజకీయంగా వాడీ వేడీగా చర్చలు నడుస్తున్నా వీరిద్దరు రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్లో ఉండడం కూడా పార్టీకి మైనస్ అయ్యింది. అస్సలు కేడర్ లో జోష్ నింపే వాళ్లే లేకుండా పోయారు. వాస్తవంగా చంద్రబాబు ఎప్పుడో అమరావతి రావాలి.. ఏపీలో పర్యటించాలి.. ఓ వైపు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చి నట్టు తిరిగేశారు. అయినా హైదరాబాద్ లోనే రెండు నెలలు ఉండిపోయారు.
ఇక టీడీపీ పెద్ద పండగ అయిన మహానాడు ప్రతి యేటా నిర్వహించడం ఆనవాయితీ. పార్టీ ఓడిపోయిన 2009లో కూడా చాలా గొప్పగా మహానాడు నిర్వహించారు. అయితే ఇప్పుడు పార్టీ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గతేడాది పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో మహానాడు పెట్టలేదు. ఇక ఇప్పుడు అయినా మహానాడు పెట్టే పరిస్థితి లేదు. కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అసలు పార్టీ కార్యకర్తలు తమ వంతుగా ప్రజలకు సాయం చేయడమే తప్పా పార్టీ అధిష్టానం కాని.. మిగిలిన నేతలు కాని సొంత కేడర్ ను.. అటు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇక ఇప్పుడు మహా నాడు నిర్వహించక పోతే పార్టీ కేడర్ లో మరింత నైరాశ్యం, నిస్పృహలు అలుము కుంటాయని చివరకు చంద్రబాబు మహానాడు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ మహానాడును టీడీపీ జూమ్ యాప్ ద్వారా నిర్వహించబోతోంది. దీనికోసం భారీస్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయినాగానీ, పార్టీ శ్రేణుల్లో ఎక్కడో పూర్తిస్థాయి నైరాశ్యం కన్పిస్తోంది. అసలు పార్టీకి భవిష్యత్తు ఉందా ? పార్టీని నమ్ముకుని ఉంటే మాకు భవిష్యత్తు ఉందా ? అని చాలా మంది కేడర్ తీవ్ర సందేహంలో ఉన్నారు.
చంద్రబాబులో మునుపటి సీరియస్నెస్ కొరవడిందన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. ఇప్పటకీ కూడా ఆయన లోపాలు తెలుసు కోవడం లేదని కొందరు అంటంటే .. మరి కొందరు మాత్రం లోకేష్ చేతిలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే తాము పార్టీలో ఉండలేమని మరి కొందరు సీనియర్లు చర్చించు కుంటున్నారట.