మే 30.. ఈ తేదీ కోసం జగన్ ఫ్యాన్స్తో పాటు ఏపీలో రైతన్నలందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున జగన్ ఫ్యాన్స్ సంభరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మే 30 ఏం జరగబోతోంది..? ఎందుకు ఆ రోజు సంభరాలు చేసుకుంటారు..? అనేగా మీ ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి మే 30కి సరిగ్గా ఏడాది. అలాగే వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) ఆయనే స్వయంగా ప్రారంభిస్తున్న రోజు. దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి.
ఇక 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. అదేవిధంగా, రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్ ఉంటుంది. ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆర్బీకేలో టీవీ.. చిత్రాలు అన్నీ ఉంటాయి.
ప్రతి రైతుకు సూచనలు, సలహాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరియు రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసివేయడమే లక్ష్యంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రైతు పంట పండించే చోటే పంట కొనుగోలు చేస్తారు. అదేవిధంగా, ప్రతి ఆర్బీకే కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు. గ్రామ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు. వీరిద్దరూ కలిసి పంట వేసేటప్పుడే ఈక్రాపింగ్ చేస్తారు. రైతుకు పంట రుణాలు ఇప్పిస్తారు. ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆర్బీకే కేంద్రం చేస్తుంది. ఇలా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. దీంతో మే 30వ తేది కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.