ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కి వచ్చి ఏడాది పూర్తయింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తో పూర్తిగా కుదేలైన తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు పై నమ్మకం లేక ఇతర పార్టీల్లోకి వెళ్లి పోతున్నారు. ఇక ఈ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటున్న టైంలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ వీడేందుకు రెడీగా ఉన్నారు అన్న వార్తలు ఆ పార్టీ అభిమానులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇదే అదునుగా వైసిపి టిడిపి ని దిమ్మ తిరిగే విధంగా దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇప్పుడు వైసీపీ వేసే మెయిన్ స్కెచ్ ఏంటంటే టీడీపీ కి ప్రధాన ప్రతి పక్ష హోదా లేకుండా చేయడం. అంటే బాబోరికి ప్రధాన ప్రతిపక్ష అధినేత హోదా లేకుండా చేయాలన్న టార్గెట్ తోనే వైసీపీ అధిష్టానం చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ప్రస్తుతం బాబోరికి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో చంద్రబాబు, ఆయన బావమరిది బాలయ్యను పక్కన పెట్టేస్తే ఆ పార్టీకి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు అవుతుంది. ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేల తో కనుక టీడీపీకి రాజీనామా చేయిస్తే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతు అవ్వడం ఖాయం.
ఈ క్రమంలోనే ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు గోడ దూకేందుకు రెడీగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్నా అటు అధిష్టానం కాని.. ఇటు ఆ ఎమ్మెల్యేలు కాని నోరు మెదపని పరిస్థితి. అలాగే విశాఖ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. వీరంతా పార్టీ మారిపోతే టీడీపీకి ఉన్న ప్రతి పక్ష హోదా కూడా గల్లంతు అవ్వడం ఖాయం. దీనిని బట్టి చూస్తే జగన్ ప్లాన్ మామూలుగా లేదనే చెప్పాలి.