కొన్ని నిర్ణ‌యాల విష‌యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీరు నిజంగా చ‌ర్చ‌నీయాశంగా అనిపిస్తుంటుంది. ఆయ‌న ఆలోచించే తీరు, తీసుకునే నిర్ణ‌యాలు అస‌లు ఇలాంటివి  సాధ్య‌మా అనే భావ‌న‌లో ఉన్న  స్థితి నుంచి సాధ్య‌మేన‌నే ధీమాను క‌లిగిస్తాయి.  మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా తీసుకున్న నిర్ణ‌యాల విష‌యంలో ఈ భావ‌న క‌లుగుతుంది. 

 

మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య‌మైన అధికారులు అంద‌రూ పాల్గొన్న ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగాయి. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని తేల్చారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

 

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో గల మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారు. అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. గాలి మరలి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చు. అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 


కాగా, మిడతల దండు విషయంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.

తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 
- మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతితో కమిటీని నియమించింది. ఈ కమిటీ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. మిడతల దండు సమీపంలోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు.
- భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి. 
- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలి. 
- 12 ఫైర్ ఇంజన్లు, 12 జెట్టింగ్ మిషన్లు సిద్ధంగా పెట్టుకోవాలి. 
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: