ప్రజారాజ్యం పార్టీతో సాధించలేని రాజ్యాధికారాన్ని జనసేన పార్టీ తో సాధించాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు. మొదట్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము పార్టీ పెట్టలేదని, ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అంటూ ప్రకటించినా ఆ తర్వాత బిజెపి, టిడిపి కూటమికి మద్దతుగా నిలబడి ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తనవంతు సాయం పవన్ అందించారు. అప్పట్లోనే అసలు తాను జనసేన పార్టీ పెట్టడానికి కారణం ప్రజారాజ్యం పార్టీ ద్వారా నష్టపోయిన అందరినీ ఆదుకోవడానికి అంటూ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారు ఎంతటివారినైనా వదిలిపెట్టని పదే పదే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా చిరంజీవి మరో తమ్ముడు పవన్ అన్నయ్య అయిన నాగబాబు పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఇదంతా జనసేన పార్టీని రాజకీయంగా పైకి తీసుకువెళ్లేందుకు అని లైట్ తీసుకున్నా, మెగా బ్రదర్స్ ఇద్దరు వైసిపి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మాజీ ప్రజారాజ్యం నాయకులు, ప్రస్తుత ఏపీ మంత్రులు ముగ్గురిని బాగా టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

IHG


 వారే విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఈ ముగ్గురు మాజీ ప్రజారాజ్యం నాయకులు. ఈ ముగ్గురినే టార్గెట్ చేసుకుని మెగా బ్రదర్స్ ఇద్దరు రాజకీయాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం విశాఖ ఎల్జి పాలిమర్స్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అవంతి శ్రీనివాస్ అక్కడే రాత్రి నిద్ర చేశారు. ఆ సందర్భంగా ఓ ఆవుకి గడ్డి వేస్తూ అవంతి దిగిన ఫోటోను నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'అన్ని పశువులు గడ్డి తినవు శ్రీను' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్త బాగా వైరల్ అయ్యింది. ప్రజారాజ్యం తాలూకు రివేంజ్ నాగబాబు ఇప్పుడు తీసుకుంటున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జారుతోంది. 

IHG


మరో మంత్రి కన్నబాబు విషయానికి వస్తే విశాఖ లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ కన్నబాబు ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఇక మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ని కూడా అదేవిధంగా టార్గెట్ చేస్తూ కొద్ది రోజులుగా మెగా బ్రదర్స్ ఇద్దరూ విమర్శలు చేస్తున్నారు. ఆకస్మాత్తుగా ఈ ముగ్గురు మంత్రులను మెగా బ్రదర్స్ ఇద్దరూ టార్గెట్ చేసుకోవడం వెనుక కారణాలు ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే అసలు చిరంజీవి మాత్రం కన్నబాబు తదితరులతో ఇప్పటికీ సన్నిహితంగానే ఉంటున్నారు. కానీ ఈ మెగా బ్రదర్స్ మాత్రం వారి మీద ఉన్న ఆగ్రహానికి కారణం ఏమిటో ఎవరికీ చెప్పకుండానే రివెంజ్ తీర్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: