ప్రత్యేక హోదా.. ఒకప్పుడు ఏపీని ఊపేసిన మాట ఇది. రాజకీయ వర్గాల్లో చాలాసార్లు వాదనలకు, మాటల యుద్ధాలకు దారి తీసిన మాట. కానీ ఈ మాట కొన్నేళ్లుగా అసలు ఏపీలో వినిపించడం లేదు. ఈ డిమాండ్ గురించి అసలు ఎవరూ మాట్లాడటం లేదు. అలాంటిది మళ్లీ సీఎం జగనే మరోసారి ఈ మాటతో అందరినీ ఉలిక్కిపడేలా చేశారు.

 

 

మన పాలన– మీ సూచన కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమథన సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ ఆరంభంలోనే ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత మనకు నష్టం జరిగిందని చెప్పకతప్పదన్న జగన్ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్‌ స్టేషన్‌ ఇస్తామని మాటిచ్చి దాని తరువాత ఇవ్వకుండా పోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు

 

 

అంతే కాదు.. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇండస్ట్రీ ఇన్సెన్టివ్స్‌ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చిఉండేవని. కేంద్ర ప్రభుత్వం భారాన్ని పంచుకునేదని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2014–19 వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ప్రత్యేక హోదాను రాష్ట్రం తెచ్చుకోలేకపోయిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మన పార్టీ ఘన విజయాన్ని సాధించినా.. 25కు 22 పార్లమెంట్‌ సీట్లు, 175 అ సెంబ్లీ సీట్లకు 151 సీట్లను స్వీప్‌ చేయగలిగినా కేంద్రంలో వారికి సంపూర్ణమైన మెజార్టీ వచ్చినందువల్ల హోదా తేలేకపోయామని కుండబద్దలు కొట్టేశారు.

 

 

బీజేపీకి మెజారిటీ రాకపోయి ఉండి ఉంటే రాష్ట్రానికి బెనిఫిట్స్‌ వచ్చేవని.. మనం ఎవరికి సపోర్టు చేయాల్సి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్‌ను వారి ముందు పెట్టేవాళ్లమని మరోసారి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు అది జరగలేదని... కేంద్రంలో ఎన్డీయే సంపూర్ణ మెజార్టీ సాధించినందువల్ల వారికి అవసరం.. పని కూడా లేకుండా పోయిందని ఆవేదన చెందారు.

 

 

ప్రత్యేక హోదా మళ్లీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ, హోదా అడగడం మానేస్తే అది ఏ రోజూ మనకు రాదు అనే సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈ రోజుకు కాకపోతే రేపయినా వస్తుంది. ఈరోజు కాకపోయినా కేంద్రం మనపై ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామనే మన ఆలోచన ముందుకు తీసుకువస్తాం. ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: