ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభన పెరుగుతుందే తప్పా.. తగ్గడం లేదు. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. కార్చిచ్చులా దేశదేశాలు వ్యాప్తిచెందింది. చైనా నుంచి ఐరోపాలో తొలుత పాదం మోపిన ఈ కరోనా భూతం.. తర్వాత అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలతో పాటు అన్ని దేశాలను చిగురుటాకుల్లా వణికిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు వాక్సిన్ వస్తుందా.. ఎప్పుడు కరోనా మహమ్మారి బారి నుండి బయట పడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.
అయితే ఇదే సమయంలో కరోనా గురించి బయట పడుతున్న కొత్త కొత్త విషయాలు.. ప్రజల గుండెల్లో ఆందోళన ఎక్కువయ్యేలా చేస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు కరోనాను వ్యాక్సిన్ వస్తే.. ఈ మహమ్మారి నుంచి గట్టెక్కినట్టే అని అందరూ భావించారు. అయితే వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదని అమెరికాకు చెందిన ఎపిడమాలజిస్టులు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. హెచ్ఐవీ, చికెన్ఫాక్స్ లా కరోనా కూడా మన మధ్యనే ఉంటుందని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికాలో నెక్ట్స్ ఫేజ్లో కరోనా మరింత తీవ్రతరం కానుందని వారు చెబుతున్నారు.
జలుబు లక్షణానికి సంబంధించిన కరోనావైరస్లు ఇప్పుడు నాలుగు ఉన్నాయని, కోవిడ్ 19 ఐదోదని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక మరోవైపు షికాగో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్టు సారా కోబే దీని స్పందిస్తూ.. వ్యాక్సిన్ వచ్చినా కరోనా ఎక్కడికి పోదు. మన మధ్యనే ఉంటుంది. ప్రస్తుతమున్న ప్రశ్న ఒక్కటే. కరోనా ఉన్నా మనం జాగ్రత్తగా ఎలా బతకాలన్నది మాత్రమే అని ఆయన కూడా స్పష్టం చేశారు. దీంతో ప్రజల్లో భయం రెట్టింపు అయింది. కాగా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 59,00,907కు చేరాయి. అందులో 25,77,250 మంది కోలుకోగా, 29,62,108 మంది వైరస్తో పోరాడుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 3,61,549కి చేరింది.