కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ఈ పేరు వింటేనే ప్రజలు తీవ్ర స్థాయిలో వణికిపోతున్నారు. అంతలా ఈ కరోనా భూతం విశ్వరూపం చూపిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి.. ప్రస్తుతం ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలోనే మానవ మనుగడకే సవాల్ విసురుతున్న కరోనా.. లక్షల మందిని బలితీసుకుంటుంది. ముఖ్యంగా మనీ పవర్తో గ్లోబ్పై ఉన్న దేశాలను శాసించే అమెరికాను కంటికి కనిపించని శత్రువు వణికిస్తోంది. యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల అమెరికాలో జరుగుతోంది.
మిగిలిన దేశాల్లోనూ అదే పరిస్థితి అయినప్పటికీ.. అమెరికాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి. మరోవైపు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58లక్షలను దాటేసింది. మరోవైపు 3.59 లక్షల మంది కరోనా కాటుకు బలైపోయారు. ఇక ప్రపంచంపై కరోనా దండయాత్ర మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా.. దీని దూకుడు మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ కరోనా భూతాన్ని ఎలాగైనా కట్టడి చేయాలని దేశదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా గురించి వెలుగులోకి వస్తున్న భయంకర విషయాలు ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ఇళ్లు, కార్యాలయాల్లో గాలి ప్రసరణ సరిగా లేకుంటే కరోనా వైరస్ను కొనితెచ్చుకున్నట్టేనని యూకేలోని సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. వాస్తవానికి మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గు ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, కానీ వైరస్ కణాలు మాత్రం అక్కడే ఉండిపోతాయని తమ తాజా అధ్యయనంలో తేలినట్టు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ప్రతి చోట ఏసీలు ఉన్నప్పటికీ వాటి పనితీరు సక్రమంగా లేకపోతే కరోనా ప్రమాదం పొంచి ఉన్నట్టేనని వెల్లడించారు. అందుకే అన్ని గదుల్లోకి గాలి, వెలుతురు పూర్తిగా వచ్చేలా చూసుకోవాలని, లేకుంటే కరోనా ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.