ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నేటితో ఏడాది పూర్తి అయింది. గత సంవత్సరం మే 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలనకు కైవం చేసుకుంది ఎవరికీ సాధ్యం కాని రీతిలో అఖండ విజయం సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించేశాడు. అనంతరం మే 30వ తేదీన జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి మేనిఫెస్టోను అమలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకున్న జగన్.. ఒక్క ఏడాదిలోనే 90శాతం హామీలను నెరవేర్చారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటేనే మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడం జరుగుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మేనిఫెస్టోలోని అంశాలపై దృష్టి సారించి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సూపర్ అనిపించుకున్నాడు. అయితే సంక్షేమం, అభివృద్ధి ఇవి ప్రగతి రథానికి రెండు చక్రాలు వంటివి. కానీ, జగన్ సర్కారు తన తొలి ఏడాదిలో వ్యక్తులను సంతృప్తిపరిచే సంక్షేమంపైనే దృష్టి సారించింది. సమగ్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. సంవత్సరకాలంలో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి కొత్తగా రాలేదు.
అంతకుముందు ఉపాధిహామీ కింద వేలకిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశారు. ఈ ఏడాదిలో ఇదీ తగ్గిపోయింది. కొత్త సాగునీటి ప్రాజెక్టులేవీ ప్రారంభించలేదు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడిదక్కడే అన్నట్లుగా తయారైంది. ఇలా జగన్ సర్కారు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యం అభివృద్ధికి ఇవ్వడం లేదనే విమర్శలు వస్తోన్న తరుణంలో.. ఏడాది పాలనలో ఏపీని అభివృద్ధి పథంలో నిలపడంలో జగన్ సక్సెస్ అయ్యారా? అని జాతీయ మీడియాలు సర్వేలు చేశాయి. దీనికి స్పందనగా.. 41.02 శాతం మంది అవునని బదులివ్వగా.. 43.08 శాతం మంది కాదు అని, 15.90 శాతం మంది చెప్పలేమని సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి జగన్ సర్కారు అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టాలని.. సంక్షేమం, డెవలప్మెంట్ మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది.