యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు. ఈ ఏడు దేశాల ఫోరమ్ పేరు G7. ఈ దేశాల అధిపతులు అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సమస్యలపై ఏటా సమావేశమవుతారు. శిఖరాగ్ర సమావేశంలో జీ 7 అధ్యక్షుడు సాధారణంగా ఒకటి లేదా రెండు దేశాల దేశాధినేతలను ప్రత్యేక ఆహ్వానికంగా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానిస్తారు. గత ఏడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఈ ఏడాది జి 7 అధ్యక్ష భాద్యతను అమెరికా నిర్వహించనుంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భారత్కు అదిరిపోయే ఆఫర్ ఇస్తూ...చైనాకు షాకిచ్చారు.
అమెరికాలోని తాజా పరిస్థితులను సమీక్షించడంలో భాగంగా, ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డిసికి తనతో పాటు ఎయిర్ ఫోర్స్ వన్లో ప్రయాణిస్తున్న విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ, జూన్లో వైట్ హౌస్లో నిర్వహించనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. అంతే కాకుండా జీ7 ను కాలం చెల్లిన గ్రూప్గా పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సమూహానికి భారత్, మరికొన్ని దేశాలను చేర్చాలని ఆయన అన్నారు. జీ7 వల్ల ప్రపంచంలో ఏమి ఉపయోగం ఉందని తాను భావించడం లేదని, ఇదో కాలం చెల్లిన సమూహం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అందుకే, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారతదేశాలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
కాగా, తదుపరి జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారత్ను ఆహ్వానించడం గురించి ట్రంప్ మాట్లాడటం దేశం పట్ల అంతర్జాతీయంగా పెరుగుతున్న స్థాయిని ప్రతిబింబిస్తుంది. చైనాను భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలో మాట్లాడటానికి జీ7 గ్రూప్ ఏ విధంగా ఉపయోగపడుతుందని దేశ సాంప్రదాయ మిత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని వైట్ హౌస్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిస్సా అలెగ్జాండ్రా ఫరా అన్నారు. ఇదిలాఉండగా, సెప్టెంబర్ వరకు సమావేశాన్ని వాయిదా వేసినప్పటికీ, అప్పటికి కరోనావైరస్ వ్యాప్తి గతి మారితే తప్ప శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం తెలిపింది.