కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచదేశాల్లోనూ ఇదే పేరు మారు మోగిపోతోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా భూతం.. ప్రస్తుతం దేశదేశాలు వ్యాప్తి చెంది.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఇక రోజువారి కూలీల పరిస్థితి అయితే మరీ అద్వాన్నంగా తయారవుతోంది. కరోనాను నియంత్రించేందుకు లాక్డౌన్ విధించడంతో రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పనుల్లేక, డబ్బులు లేఖ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎప్పుడు? ఎలా? ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. దీంతో కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.. వైరస్ పుట్టిన చైనా మొదలుకు కొన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు.. కరోనా వ్యాక్సిన్పైనే ఫోకస్ పెట్టాయి. ఇక ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనడంలో సఫలీకృతం అవుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే అతి త్వరలో వ్యాక్సిన్ వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నాయి. అయితే వీరందరి ఆశలపై బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా నీళ్లు చల్లారు.
ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాల్లేవని, కనీసం నాలుగేళ్లు ఆగాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చాడు. అలాగే ఏడాదిలోపే టీకాను అభివృద్ధి చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పనేనని అన్నారు. వ్యాక్సిన్కు భద్రత, తగినంత సామర్థ్యం ఉండాలంటే పలు ప్రక్రియలు అవసరమని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సురక్షితమైన వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పడంతో.. ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కవ అయ్యాయి.