తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, విద్యార్థుల విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తాజాగా పరీక్షల విషయాన్ని సమీక్షించారు. టెన్త్ పరీక్షల నిర్వహణ, -కరోనా కట్టడి చర్యలపై ఆమె రివ్యూ చేశారు. ఈ సందర్భంగా వారం రోజుల ముందే స్టూడెంట్లు హాస్టళ్లకు చేరుకునేలా చూడాలని సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రతి స్టూడెంట్కూ థర్మల్ స్క్రీనింగ్ చేసి అబ్జర్వేషన్లో పెట్టాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలని చెప్పారు.
హాస్టల్లకు వచ్చిన ప్రతి స్టూడెంట్కు రెండు మాస్కులు, ఒక శానిటైజర్ ఇవ్వాలని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. స్టూడెంట్లకు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెన్త్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని ఆమె తెలిపారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని స్కూళ్లలో 2,949 మంది స్టూడెంట్లున్నారని, అన్ని జిల్లాల్లో వాళ్ల కోసం 38 సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో టీచర్లు, సిబ్బంది దగ్గరుండి తీసుకెళ్లాలని చెప్పారు. హాస్టళ్లు, పరీక్షా కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు లేకుండా ఎవరినీ అనుమతించొద్దన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పినాకి హెల్త్ కమాండ్ సెంటర్ సేవలను వాడుకోవాలని అధికారులకు మంత్రి వెల్లడించారు.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 23 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షల్ని వాయిదా వేసింది. ప్రభుత్వ చర్యల కారణంగా వైరస్ అదుపులోకి వచ్చిందని, పరిస్థితులు మెరుగుపడినందున టెన్త్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చి లక్షలాది మంది స్టూడెంట్ల భవిష్యత్ను కాపాడాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్.. హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వైద్య శాఖ సూచనల మేరకు ఎగ్జామ్ సెంటర్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు, శానిటైజర్లు, మాస్క్లు, మంచినీళ్లు ఏర్పాటు చేస్తామని, సెంటర్లను ప్రతిరోజు శానిటైజ్ చేసి శుభ్రంగా ఉండేలా చేస్తామని వెల్లడించారు. 2,530 ఎగ్జామ్ సెంటర్లను 4,535కు పెంచామని, ఎగ్జామ్ సెంటర్లో స్టూడెంట్లను 240 మంది నుంచి సగానికి తగ్గించామని తెలిపారు. ఒక్కో రూంలో కేవలం పది నుంచి 12 మందితోనే పరీక్షలు రాయిస్తామని చెప్పారు. దీంతో పదో తరగతి పరీక్షలకు కోర్టు అనుమతి ఇచ్చింది.