గోవా...దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన సందర్శనీయమైన ప్రాంతాలున్నరాష్ట్రాల్లో గోవా టాప్లో నిలుస్తుంది. గోవా బీచ్లలో సేదతీరడానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దఎత్తున వస్తారు. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడుతుంది. అయితే, కరోనావైరస్ మహమ్మారి అన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాలను బాగా దెబ్బతీసింది. ఈ క్రమంలో తిరిగి ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గోవా ప్రభుత్వం తెలిపింది.
కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘కఠినమైన‘ చర్యలు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే గోవా మళ్ళీ తిరిగి అభిమాన పర్యాటక కేంద్రంగా వెలుగుతుందని రాష్ట్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖను కూడా నిర్వహిస్తున్న గోవా పరిశ్రమల శాఖ మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకం, ఇతర ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. కరోనా రోగులకు సంబంధించినంతవరకు గోవాలో అద్భుతమైన రికవరీ రేటు ఉందన్నారు. ఇటీవల కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగినప్పటికీ ఇప్పుడు తగ్గిందని ఆయన చెప్పారు. గోవాలో ప్రస్తుతం 28 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 70 మంది రోగులలో 42 మంది కోలుకున్నారు.
ఇదిలాఉండగా, గోవాలో మళ్లీ దేశీయ పర్యాటకుల తాకిడి మొదలవుతుందని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో గోవాలో భవిష్యత్ టూరిజంపై ఆయన కామెంట్ చేశారు. గోవాలో కరోనా వైరస్ కేసులు లేవని, విదేశీ టూరిస్టులు కూడా గోవాకు వస్తారని, కానీ దానికి మరింత సమయం పడుతుందన్నారు. ఇదేమీ దీర్ఘకాలిక నష్టం కాదన్నారు. కాగా, ఇటు గవర్నర్ అటు రాష్ట్ర ప్రభుత్వం గోవాలో పర్యటకం గురించి భరోసా ప్రకటనలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోకి పర్యాటకుల రాక పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కొద్దికాలం తర్వాత ఈ తాకిడి పెరగనుందని చెప్తున్నారు.