కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మహమ్మారి భయమే ప్రజల్లో కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా భూతం ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం ఈ ప్రాణాంతకర కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో అన్ని దేశాలు నివారణపైనే ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా భయం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటించండి అంటూ జగన్ సర్కార్ కొన్ని సూచనలు చేసింది. వాటిని పరిశీలిస్తే..
చేయవలసినవి:
- బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ను ధరించాలి.
- రెండు గంటలకు ఒకసారి 20-40 సెకెండ్లు చేతులను సబ్బు లేదా శానిటైజర్తో పూర్తిగా శుభ్రపరచుకోవాలి.
- ఆరోగ్యసేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించండి.
- తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మోచేతిని అడ్డు పెట్టుకోవాలి లేదా టిష్యూపేపర్ను ఉపయోగించాలి.
చేయకూడనివి:
- కళ్లు, ముక్కు, నోటిని తరచూ తాకడం వంటివి చేయకూడదు.
- పనిమీద బయటకి వెళ్లి ఇంటికి వచ్చిన వారు కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లడం చేయకూడదు.
- రద్దీ ప్రదేశాలకు, సమావేశాలకు, వేడుకలకు వెళ్లడం చేయకూడదు.
- డోర్ హ్యాండిల్స్, రైలింగ్, లిఫ్ట్లోని స్విచ్లు వంటి తరచూ తాకే ప్రదేశాలను తాకకూడదు.
ఇక కరోనా లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష కోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, నోటిపై చేయబడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టెస్టింగ్ సదుపాయం వినియోగించుకోవచ్చు.