భారత దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు రూటుమార్చిన సైబర్ కేటుగాళ్లు.. సామాన్య పేద ప్రజలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో ఆహారం, మద్యం, ఖరీదైన వస్తువుల విక్రయం, ఆఫర్ల పేరిట దోచేస్తున్నారు. ఆరోజు మార్కెట్లో ఏది ట్రెండింగ్లో ఉంటే ఆ మార్గంలోనే ఆన్లైన్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఫోన్లకు వచ్చే ఓటీపీలు చెప్పవద్దని ప్రజల్లో కొంతవరకు అవగాహన రావడంతో.. ఆన్లైన్లో తక్కువ ధరలకే వస్తువులంటూ ఆశచూపి మోసాలు చేస్తున్నారు.
సామాన్య ప్రజలకు ఆఫర్ అంటే పడిచచ్చిపోతారు.. దీన్ని కొంత మంద కేటుగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకొని ఎంతో మందిని బురడీ కొట్టిస్తున్నారు. మనిషి బలహీనతలను గుర్తించి సొమ్ము చేసుకుంటున్నారు. లాక్డౌన్లోనే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 86 శాతం పెరిగినట్టు పలు సర్వేలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 80 శాతానికిపైగా ఓఎల్ఎక్స్ పేరిట నమోదవుతున్నట్టు సైబర్క్రైం పోలీసులు చెప్తున్నారు. కరోనా వేళ పీఎం కేర్స్ ఆన్లైన్ విరాళాల వెబ్సైట్లోనూ పలు అక్షరాలు మార్చి నకిలీ వెబ్సైట్లతో డబ్బు దండుకున్నారు.
గత ఐదేండ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి 6,217 కేసులు నమోదయ్యాయి. సైబర్ మోసగాళ్లలో ప్రధానంగా నైజీరియన్స్ తర్వాత.. రాజస్థాన్లోని భరత్పూర్, అల్వార్, హర్యానాలోని మేవట్, ఢిల్లీ, జార్ఖండ్లోని జామ్తార ఇలా చాలావరకు ఉత్తరాది రాష్ర్టాలవారే ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్ర పోలీసులు దొంగల లొకేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్తున్నా, స్థానిక ముఠాలు, అక్కడ పోలీసులతో మోసగాళ్లకు ఉన్న సంబంధాలతో విషయం ముందే వారికి తెలిసిపోతున్నది. ఏది ఏమైనా అపరిచితుల నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.