ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయంలో అనేక ట్విస్ట్లు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ సరిగా వ్యవహరించలేదని చెబుతూ, జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఐదేళ్లు ఉండే పదవీకాలాన్ని మూడేళ్లకు తగ్గించి, నిమ్మగడ్డని పదవినుంచి తప్పించి, ఆ స్థానంలో జస్టిస్ కనగరాజ్ని నియమించారు.
అయితే తనని అన్యాయంగా తప్పించారంటూ నిమ్మగడ్డ హైకోర్టు మెట్లు ఎక్కగా, అక్కడ జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసి, నిమ్మగడ్డనే మళ్ళీ ఎస్ఈసిగా నియమించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ జగన్ ప్రభుత్వం సుప్రీంలో లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకటి,రెండు రోజుల్లోనే ఈ పిటిషన్పై విచారణ జరిగేలా ఉంది. ఇక అక్కడ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా సుప్రీం కూడా హైకోర్టు తీరునే సమర్ధిస్తే పరిస్తితి వేరేగా ఉంటుంది.
కానీ నిమ్మగడ్డని ఎలాగైనా తప్పించాలని జగన్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేంద్రం దగ్గర లాబీయింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్ తాజాగా హోమ్ మంత్రి అమిత్ షాని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే సడన్గా జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ప్రస్తుతం నిసర్గ తుపాను ముందస్తు కార్యక్రమాల్లో అమిత్ షా బిజీబిజీగాగా ఉన్నారు. అయితే తుపాను తర్వాత మళ్లీ అపాయింట్మెంట్ ఇస్తామని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎంవోకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక తర్వాత అపాయింట్మెంట్ దొరికినప్పుడు అమిత్ షాని కలిసి నిమ్మగడ్డని ఇక్కడ నుంచి బదిలీ చేసి, ఏపీ ఎలక్షన్ కమిషనర్గా మన్మోహన్సింగ్ను నియమించాలని జగన్ కోరనున్నట్లు సమాచారం. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అయిన అమిత్ షా ద్వారా, కేంద్ర ఎలక్షన్ కమిషన్కు చెప్పి ఈ కార్యక్రమం జరిగేలా చూడనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సీఎస్ కేడర్లో మన్మోహన్సింగ్ పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అమిత్ షా, జగన్ రిక్వెస్ట్ని అంగీకరించి ఎలక్షన్ కమిషనర్ని మార్చే ప్రక్రియ చేపడతారా? లేదా? అనేది సస్పెన్స్గా మారింది.