చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడిప్పుడే వుహాన్ నగరం కోలుకుంటోంది. అయితే.. వైద్యాధికారులు చేపట్టిన సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షల్లో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మే 14వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వుహాన్ పట్టణంలో ఏకంగా 98,99,828 మందికిపైగా న్యూక్లియిక్ యాసిడ్ (నాట్) పరీక్షలు చేశారు. కేవలం మూడు వారాలలోపే ఇంత జనాభాకు పరీక్షలు చేయడం గమనార్హం. ఈ పరీక్షల్లో 300మంది సైలెంట్ స్ర్పెడర్స్ను వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ.. వారికి కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు షాక్ తిన్నారు.
వీరి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయి వారిని ఐసోలేషన్కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇలాంటి కేసులను చైనా ప్రభుత్వం గుర్తించకపోవడం గమనార్హం. సుమారు 11వారాలపాటు కొనసాగిన లాక్డౌన్ నుంచి వుహాన్ నగరం సడలింపులు ఇచ్చారు. నిజానికి.. లాక్డౌన్ను ఎత్తేశారు. అయితే.. నెల తర్వాత వుహాన్ నగరంలోని ఒక నివాస సముదాయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై.. వెంటనే సామూహిక పరీక్షలు చేయడం ప్రారంభించారు. కేవలం మూడు వారాలలోపే కోటిమందికి చేరువలో పరీక్షలు పూర్తి చేశారు. ఈ పరీక్షల్లో గుర్తించిన 300మంది సైలెంట్ స్ప్రెడర్లకు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.
*నగరంలో ఒకే రోజులో గరిష్టంగా 2907 నిర్ధారణ పరీక్షల పాయింట్లను ఏర్పాటు చేశాం. 280,000 మంది సిబ్బంది, 50,000 మందికి పైగా వైద్య సిబ్బంది సేవలలో పాల్గొన్నారు* అని వుహాన్ మునిసిపల్ హెల్త్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ వాంగ్ వీహువా చెప్పారు. *జూన్ 1 న వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కుళాయి నీరు, మురుగునీటి నమూనాలను సేకరించింది. టాక్సీలు, బస్సులు, సబ్వే కార్లు, స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పార్కుల నుంచి నమూనాలు సేకరించాం* అని అధికారులు తెలిపారు. అయితే.. 2314 నమూనాల్లో పరీక్ష ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయని వెల్లడించారు.