దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ సమయంలో ముందుగానే నిశ్చయం కావడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. ఇదే సమయం భారీ సంఖ్యలో ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి.
తాజాగా పంజాబ్కు చెందిన యువ జంట తమ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. అనంతరం . పెద్దల నుంచి హెచ్చరికలు ఉండటంతో రక్షణ కల్పించాలంటూ పంజాబ్ - హర్యానా హైకోర్టును నవదంపతులు ఆశ్రయించారు. అయితే కోర్టు వారికి రివర్స్ లో షాక్ ఇస్తూ 10,000 రూపాయల జరిమానా విధించింది. అనంతరం వారికి రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించింది.
పూర్తి వివరాలలోకి వెళితే గురుదాస్పుర్కు చెందిన ఒక యువతి, యువకుడు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొని లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అనంతరం పెద్దల నుంచి బెదిరింపులు రావడంతో మే 23న గురుదాస్పుర్ ఎస్పీని కలిసి సమస్య చెప్పుకున్నారు. హైకోర్టులో పెళ్లి ఫోటోలతో పిటిషన్ దాఖలు చేసి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
హైకోర్టు పిటిషన్ ను విచారాణకు స్వీకరించి విచారణలో భాగంగా ఆ ఫోటోలను పరిశీలించింది. నవ దంపతులతో పాటు వేడుకకు హాజరైన బంధుమిత్రులు మాస్కులు ధరించలేదని హైకోర్టు గుర్తించింది. పెళ్లి సమయంలో మాస్క్లు ధరించలేదనే కారణంతో రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సొమ్మును 15 రోజుల్లోగా చెల్లించాలని చెప్పిన కోర్టు 10,000 రూపాయలను హోషియార్పూర్ జిల్లాలో ప్రజలకు మాస్క్లను పంపిణీ చేయడానికి ఉపయోగించాలని ఆదేశించింది.