హైదరాబాద్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. సామాన్య జనంతోపాటు వైద్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతుండడంతో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్లో ఇప్పటివరకు 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నగరంలో ఏకంగా 143 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజులుగా వైద్యసిబ్బంది వైరస్ బారిన పడడం.. వైరస్ నియంత్రణ అదుపుతప్పిందనే దానికి సంకేతమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతో పాటు, నిమ్స్లో ఒకరి తర్వాత మరొకరు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 46 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న 13 మంది పీజీ వైద్యులు వైరస్ బారిన పడగా.. తాజాగా మరో ఇద్దరు పీజీలకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరి సంఖ్య 15కు చేరింది.
అలాగే ఇదే కాలేజీకి అనుబంధంగా పని చేస్తున్న ఓ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 18 మంది వైద్యులు వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోనే మొత్తం 33 మందిæ వైద్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. కాలేజీ హాస్టల్లో ఉంటున్న జూనియర్ డాక్టర్లు ఒక్కొక్కరికి వైరస్ సోకుతుండటంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో బుధవారం నలుగురు రెసిడెంట్ డాక్టర్లు సహా మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. గురువారం ఇదే విభాగంలోని మరో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఒక ప్రొఫెసర్ సహా, ముగ్గురు హౌస్ సర్జన్లు, ఒక ఉద్యోగి, మరొక రోగి ఉన్నట్లు తెలిసిం ది. కార్డియాలజీ విభాగంలోని వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో ఇప్పటికే ఆ విభాగంలో ఉన్న రోగులందరినీ డిశ్చార్జ్ చేశారు. నిమ్స్ లో 60 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.