ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్టంలోని విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందజేయనుంది. అయితే ప్రభుత్వం అందరికీ స్మార్ట్ ఫోన్లను అందజేయడం లేదు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుంది. కరోనా విజృంభణ వల్ల విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ ద్వారానే విద్యను అభ్యసిస్తున్నారు. 
 
నిరుపేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను విద్యార్థులకు ఉచితంగా అందించనున్నారని తెలుస్తోంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 
 
వీరిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన వారి దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేకపోవడంతో ఆన్‌లైన్‌ విద్యకు ఆటంకాలు కలుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. విద్యార్థుల కోసం జగన్ సర్కార్ ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. 
 
తాజాగా రాష్ట్రంలో ఐదు ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖలో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రిలలో ఒక్కొక్కటి చొప్పున ప్రభుత్వం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత విషయంలో తొలిస్థానంలో నిలిచే గురుకులానికి రూ. 50 వేలు, రెండో స్థానంలో నిలిచిన గురుకులానికి రూ. 30 వేలు ప్రోత్యాహకంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: