కరోనా కలకలం దేశంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్లో గత 24 గంటల్లో 9887 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదేవిధంగా ఈ మహమ్మారి వల్ల కొత్తగా 294 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6642కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 1,15,942 మంది చికిత్స పొందుతుండగా, 1,14,073 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో పలువురు పర్యావరణవేత్తలు, నిపుణులు, ఇంజినీర్లు కీలక అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
‘జీవవైవిధ్యం’ అనే అంశంపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రపంచం కొవిడ్ వైరస్ గుప్పిట్లో ఉందని, దాని నుంచి బయటపడాలంటే జీవవైవిధ్యాన్ని రక్షించుకునే చర్యలు చేపట్టాలని ఐఈఐ జాతీయ అధ్యక్షుడు నరేందర్సింగ్ హాజరై మాట్లాడారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల అనేక ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయని, మానవ తప్పిదాల వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నారు. జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల కొవిడ్ లాంటి వైరస్లు విస్తరిస్తున్నాయని పలువురు పర్యావరణవేత్తలు, నిపుణులు, ఇంజినీర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని దారుణాలు జరుగక ముందే తేరుకోవాలని సూచించారు.
ఇదిలాఉండగా, దేశంలో రికవరీ రేటు శుక్రవారం కంటే కొద్దిగా తగ్గి శనివారం 48.20 శాతానికి చేరింది. శుక్రవారం ఇది 48.27 శాతం ఉన్నది. అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర (80229) మొదటిస్థానంలో ఉండగా, 28,694 పాజిటివ్ కేసులతో తమిళనాడు, 26,334 కరోనా కేసులతో ఢిల్లీ వరుగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (19094), రాజస్థాన్ (10,084), ఉత్తరప్రదేశ్ (9733), మధ్యప్రదేశ్ (8996), పశ్చిమబెంగాల్ (7303) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వారం రోజుల క్రితం తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ కేవలం ఏడు రోజుల వ్యధిలో ఆరో స్థానానికి చేరింది.