తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం బెంబేలెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా కేసులు నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదకాగా పదిమంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3496కి చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే నమోదయ్యాయి. 152 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి. రంగారెడ్డిలో 10, మేడ్చల్లో 18, నిర్మల్లో 5, మహబూబ్నగర్లో4 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్లో రెండేసి చోప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 123 మంది మరణించారు.
ఇప్పటి వరకు 1710 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. 1663 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో శనివారం ఒక్కరోజే కొత్తగా 210 కేసులు నమోదు అయ్యాయి. వివిధ జిల్లాలకు చెందిన వారు 161 మంది, వలస కూలీలు 41 మంది, ఎన్ఆర్ఐలు 8 మంది ఉండడం గమనార్హం. దీంతో ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 4460కి పెరిగింది. వాటిలో 13 జిల్లాలలో 3588 కేసులు, విదేశాల నుంచి వచ్చిన 131 కేసులు, వలస కూలీల 741 కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 73 మంది మరణించారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా రూరల్ ఏరియాలో కూడా ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.