మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీని తగ్గించేందుకు వీలుగా ఢిల్లీ ప్రభుత్వం ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విపక్షాలతో పాటు స్థానిక జనం నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మద్యం అమ్మకాలు కూడా భారీగా పడిపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలపడంతో ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈనేపథ్యంలో మద్యం ధరలను సోమవారం నుంచి తగ్గిస్తున్నట్లు లాక్డౌన్కు ముందున్న ధరలకే మద్యం విక్రయాలు జరిపేలా చూడాలని ఎక్సైజ్ అధికారులకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు.
మద్యంపై కరోనా ప్రత్యేక రుసుం ఎత్తివేయాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రేపటి నుంచి సాధారణ ధరలకే మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపారు. రెస్టారెంట్లు, మాల్స్, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతినివ్వగా సామాజిక దూరం పాటించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉండగా రేపటి నుంచి రాష్ట్ర సరిహద్దులను తెరుస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే దిల్లీలో హోటళ్లు, బ్యాంకెట్ హాళ్లను ప్రారంభించేందుకు సీఎం కేజ్రీవాల్ సానుకూలత వ్యక్తం చేయలేదు. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వు చేసినట్లు స్పష్టం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో కరోనా రోగులకు ఆస్పత్రులు సరిపోవడం లేదనీ, దీని కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జూన్ చివరి నాటికి ఢిల్లీలో మరో 15 వేల పడకలు అవసరమవుతాయని ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపినట్లు కేజ్రివాల్ చెప్పారు. న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులు మినహా మిగిలిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఢిల్లీ వాసులకే కేటాయించాలని కేజ్రీవాల్ నిర్ణయించారు.