కరోనా వైరస్ వ్యాప్తికి పుట్టినిల్లయినా చైనాపై అమెరికా పోరు సలుపుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజాన్ని దెబ్బతీసేందుకే చైనా కుయుక్తులు పన్నుతోందని అమెరికా మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న వ్యాక్సిన్ అభివృద్ధిని అడ్డుకోవడం లేదా నెమ్మది పరిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రిపబ్లికన్ సెనెటర్ రిక్ స్కాట్ ఆరోపణలు చేయడం గమనార్హం. దీంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారితో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వైరస్ను నిర్మూలించేందుకు, మానవాళిని రక్షించేందుకు ఎన్నో దేశాలు వ్యాక్సిన్ తయారీకి నిర్విరామంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తయారీ కీలక దశకు చేరుకున్న సమయంలో చైనా అడ్డుకోవాలని చూస్తోందని రిక్స్కాట్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆరోపణలు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా అమెరికా వద్ద ఉన్నాయని తెలిపాడు. అయితే వివరించడానికి మాత్రం ఇష్టపడలేదు. వాస్తవానికి శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు నిపుణులు మాట్లాడితేనే బాగుంటుందని తెలిపాడు. అయితే తనకు మేధావి వర్గం నుంచి తెలిసిందని, అది ఎంతో విశ్వసనీయమైన సమాచారం కూడా అని వక్కాణించాడు. వాస్తవానికి కరోనా వైరస్ గురించి దాచి ఈ మానవాళికి చైనా ఎంతోద్రోహం చేసింది.
కనీసం ఆ పశ్చాతపం కూడా వారిలో కనిపించకపోవడం క్షమార్హం కాదని పేర్కొన్నారు. చైనా అమెరికాతో సత్సంబంధాలను కోరుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యదేశాలకు విరోధిగా ఉండాలని చైనా నిర్ణయించుకున్నట్లుదని అన్నారు. ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. శనివారం కొత్తగా 21975 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,87,683కి చేరాయి. అలాగే నిన్న 687 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 112077కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా శనివారం 122207 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 69,62,528కి చేరాయి. అలాగే నిన్న 4098 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 401544కి చేరింది.