తెలంగాణలో కేటీఆర్ వర్సస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ బాగానే వేడెక్కుతోంది. కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌజ్ కట్టారంటూ రేవంత్ రెడ్డి జాతీయ హరిత ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదన్నారు. ఈ విషయంలో చివరకు న్యాయమే గెలుస్తుందని.. తనపై అనవసరంగా అపవాదులు వేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు.

 

 

ఈ అంశంపై ఇప్పుడు ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ పోసాని అండగా మాట్లాడారు. కేటీఆర్ చాలా మంచి నాయకుడంటూ ఆయన వర్ణించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసులో ఏకంగా ఏభై లక్షల రూపాయలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఆరోపణలు చేయడమేంటని పోసాని మండిపడ్డారు.

 

 

అసలు రేవంత్ రెడ్డి కేటీఆర్ ను రాజీనామా చేయాలని అనడంలో లాజిక్ లేదని పోసాని అంటున్నారు. అదే సమయంలో పోసాని హరీశ్ రావుపైనా ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్, హరీష్ రావు నిజాయితీగల రాజకీయవేత్తలని మెచ్చుకున్నారు. వీరే భవిష్యత్ తెలంగాణకు రెండు కళ్లు అని పోసాని కృష్ణ మురళీ కామెంట్ చేశారు. అదే సమయంలో పోసాని ఓ వెరైటీ కామెంట్ కూడా చేశారు. ఒక వేళ రేవంత్ రెడ్డి కేటీఆర్ అవినీతిని నిరూపిస్తే... టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతానన్నారు.

 

 

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని నేలలు సస్యశ్యామలం అవుతాయని.. ఇంత మంచి ప్రాజెక్ట్ కడితే కమీషన్ల కోసం అని ప్రతిపక్షాలు విమర్శించడమేంటని పోసాని తప్పుబట్టారు. మొన్నటికి మొన్న మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కు మద్దతిచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: