ఈ రోజు (జూన్ 8) నుంచి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఈ రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది.ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి.
మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇక కార్తె ప్రవేశం రోజు..ఏం వంట చేశారు అని అడిగితే..ఠక్కున చేపల కూర..చేపల పులుసు..అని చెబుతుంటారు. ఎప్పుడూ తినని వారు సైతం..ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం చేపలు తింటుంటారు. మరికొందరైతే..ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురు వేసుకుని తింటుంటారు.
మృగ శిర కార్తె ప్రవేశం రోజు చేపలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో చేపల ధరలకు రెక్కలు వస్తుంటాయి. సాధారణ రోజు కంటే కిలో చేప ధర రెట్టింపు పలుకుతుంది. బొమ్మె అయితే..రూ. 600 నుంచి వెయ్యి దాక ఉంటాయి. ఈ రోజు చేపలు తినడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఇక చేపల్లో పోషక పదార్థాలు :
- చేపలలో అనేక మాంసకృత్తులతోపాటు శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
- కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
- మానవునికి కావాల్సిన అతి ముఖ్యమైన, రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసొల్యూసిన్ వంటి అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.
- చేప కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా ఎవరైనా తినచ్చు.
- చేపల్లో ఉన్న కొవ్వులు (కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్) మన శరీర రక్త పీడనంపై (అంతిమంగా గుండెపై) మంచి ప్రభావం చూపుతాయి.
- ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
- (థయామిన్, రైబోప్లవిన్, నియాసిన్, పెరిడాక్సిన్, బయోటిన్, పెంటోదినిక్ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
- సముద్ర చేపల కాలేయంలో (కాడ్ చేప) విటమిన్ ఏ, డీ, ఈ వంటి కొవ్వులో కరిగే విటమిన్స్ ఎక్కువగా లభిస్తుంది.