దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. దాంతో పాఠశాలలు, థియేటర్లు, మాల్స్, దేవాలయాలు.. ఇతర జనసమూహం గల ప్రదేశాలన్నీ మూసివేశారు. ఈ మద్య లాక్ డౌన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మార్గదర్శకాలు సూచించారు. ఈ నేపథ్యంలో దేవాలయాలు నేటి నుంచి తెరుచుకుంటున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించారు. లక్నోలో ఉన్న యాహియాగంజ్ గురుద్వారాలో పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం జరిగిన ప్రార్థనల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయం ఉదయం ఏడు గంటలకు తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు ప్రవేశం కల్పించారు. అయితే ఆలయాలకు వచ్చే భక్తులు సుచీ శుభ్రత పాటించాలని.. భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలని.. శానిటైజర్, మాస్క్ లు ఉండాలని ఆంక్షలు విధించారు. పంజాబ్లోని లూథియానాలో ఉన్న దుర్గా మాత ఆలయం ప్రారంభమైంది. సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్లో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.
ప్రార్థనా మందిరాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేసిన అధికారులు భక్తులకు ప్రవేశం కల్పించారు. దేవాలయంలోకి ప్రవేశించాలంటే థర్మల్స్క్రీనింగ్ తప్పనిసరని అని ప్రకటించారు. ఢిల్లీలోని కల్కాజీ దేవాలయం, గౌరీశంకర్ ఆలయం ఉదయాన్నే తెరుచుకున్నాయి. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లలో నిల్చున్నారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను అమలుచేస్తామని ఆలయ అధికారులు చెప్పారు.