టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఎగతాళి చేస్తూ, ఆయనపై కామెంట్లు చేసే విషయంలో యాక్టివ్ గా ఉంటూ వస్తారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. కొద్దిరోజులుగా నారా లోకేష్ యాక్టివ్ గా కనిపించడమే కాకుండా, వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ జగన్ కు సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి లోకేష్ వ్యవహారశైలిపై స్పందించారు. లోకేష్ బాబు ఆవేశం చూస్తుంటే, ఏదో ఒక ఉపద్రవం ముంచుకు వచ్చేలా కనిపిస్తోందని విజయ్ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. టిడిపి అధ్యక్షుడిగా తనను కాదని, తన తండ్రి చంద్రబాబు నాయుడు మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్ను కొచ్చిన ఆవేదన తాలూకా ఉద్రేకం బయట పడినట్లు అనిపిస్తోంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ‘ఆవేదన తాలూకు ఉద్రేకం’ బయటపడినట్టు అనిపిస్తోంది. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు పాపం.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 9, 2020
పనికిరాడని సొంత తండ్రి సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని లోకేష్ కుంగిపోతున్నారు పాపం అని ఎద్దేవా చేశారు. అలాగే ప్రస్తుతం కరోనా కారణంగా హైదరాబాద్ లోని తన సొంత ఇంటికి పరిమితమైపోయిన చంద్రబాబు, మనసు మాత్రం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది అంటూ కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై చంద్రబాబు వర్కౌట్ చేస్తున్నాడని, విజయసాయిరెడ్డి విమర్శించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తన మనుషులను ఢిల్లీకి పంపించారని, ఎల్లో మీడియా కూడా చంద్రబాబు ఏదో చారిత్రాత్మిక ఘట్టం చేస్తున్నట్టుగా కథనాలు వండి వార్చుతోంది అని ఆయన విమర్శించారు.
రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లిచ్చాడు. ఎక్కడ గ్యాంగ్ వార్ జరిగినా రక్తపాతం సృష్టించేది బాబు గారి అనుంగు శిష్యులే. జగన్ గారి పైనే హత్యాయత్నం చేయించిన చరిత్ర. 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసేమిటని వెనకేసుకొచ్చాడు. రికార్డులు తీస్తే ఆయన హయాంలోనే ఆమె పైన 13 FIR లు నమోదయ్యాయని తేలింది.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 9, 2020
ఇక మరో ట్విట్ లో విజయవాడ గ్యాంగ్ వార్ గురించి స్పందించారు. రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు ది అని, ఎక్కడ రక్తపాతం జరిగినా రక్తపాతం సృష్టించేది చంద్రబాబు నాయుడు గారి అనుంగు శిష్యులే అన్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టిన రంగనాయకమ్మ అనే వృద్ధురాలి వ్యవహారంలోనూ విజయసాయి స్పందించారు. 60 ఏళ్ళ వృద్ధురాలిపై కేసులు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారని, తీరా రికార్డ్స్ తీస్తే ఆమెపై తన హయాంలోనే 13 ఎఫ్ఐర్ లు నమోదయ్యాయి అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.