ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లల చదువులకు ఆటంకం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 1 - 10 తరగతులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనుంది. 1 - 5 తరగతులకు బ్రిడ్జి కోర్స్, 6 - 9 క్లాసెస్ స్టూడెంట్లకు సబ్జెక్టు లెసన్స్ బోధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి టీచర్స్ వారానికి ఒకసారి పాఠశాలలకు రానున్నారని తెలిపింది.
ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి స్టూడెంట్స్ కోసం స్పెషల్ గా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను వారికి అందించనుంది. ఇంగ్లీషు మీడియం విధానంలోనే ఇంగ్లీషు, మ్యాథ్స్ బోధన జరుగుతుంది. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 వరకు... 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు.... 6, 7 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు.... 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు టెలికాస్ట్ అవుతాయి.
ఒకటి నుంచి 5 తరగతులకు పాఠాలు బోధించే టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. 6 - 7 తరగతుల హెచ్.ఎమ్, టీచర్స్ 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. 8 - 9 తరగతులకు పాఠాలు చెప్పే టీచర్స్ 19 నుంచి ప్రతి శుక్రవారం... పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం విద్యార్థులకు టీవీ పాఠాలు చెప్పాలని తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.