తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యపై వివాదం రగులుకుంటోంది. లక్షణాలు ఉన్నవారికే టెస్టులు, డెడ్ బాడీస్కు పరీక్ష చేయకపోవడం రాజకీయంగా మంటలు రేపుతోంది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే.. దేశంలోనే అతి తక్కువ టెస్టులు తెలంగాణలో జరగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
తెలంగాణలో కరోనా టెస్టులు వివాదాస్పదం అవుతున్నాయి. మొదటి నుంచి యాంటీ బాడీస్ టెస్టుల జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లలేదు. అలాగే లక్షణాలు ఉన్న వారికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తోంది. ఇటు కేంద్రం అనుమతించిన ప్రైవేటు ల్యాబ్లకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. ఇప్పుడు కేసులు భారీగా పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రులు కూడా కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి. కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆరోపిస్తోంది కాంగ్రెస్.
ప్రభుత్వ ఆసుపత్రులకు సామర్థ్యం ఉన్నా కుట్ర పూరితంగా ఆరోపణలు చేస్తున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎల్పీనేత భట్టి ఫైర్ అయ్యారు. కుట్ర ఎవరు చేశారు? కుట్రదారుడు ఎవరు? కుట్ర చేస్తుంటో ఫాం హౌస్లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మొదటి నుంచి కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తోందని ఆరోపిస్తోంది బీజేపీ. సీఎం కేసీఆర్ ఆస్పత్రులను చూస్తే అసలు విషయం తెలుస్తుందని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, డాక్టర్లకు రక్షణ కిట్లు లేవని సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది.
ప్రభుత్వం మాత్రం కేంద్రం, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా వైద్యం చేస్తున్నామని చెప్తోంది. అన్ని మృతదేహాలకు టెస్టులు చేయడం అసాధ్యం అని, లక్షణాలు లేని వారికి టెస్టు అవసరమని వాదిస్తోంది.
ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి అక్షింతలు వేస్తోంది. కరోనా టెస్టుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడింది. మరోవైపు డెడ్ బాడీలకు టెస్టులు చేయాలన్న హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.