తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ కు ఝలక్ ఇస్తున్నారా..? గతం నుంచి తెలంగాణ ఆర్టీసీకి జరుగుతున్న అన్యాయాన్ని కరోనా సాకుతో ఇప్పుడు సెటిల్ చేయబోతున్నారా.. అంటే అవుననే చెప్పాలి. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య బస్సు సర్వీసులు అన్నీ ఏపీఎస్ ఆర్టీసీ చూసుకునేది. ఆ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత సర్వీసులు రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి.
అయితే లాభదాయకమైన సర్వీసులు ఏపీకి ఎక్కువగా వెళ్లాయని.. నష్టదాయకమైన, అంతగా లాభం లేని సర్వీసులు ఎక్కువగా తెలంగాణకు వచ్చాయని అప్పట్లోనే తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఈ ఇష్యూ సెటిల్ కాలేదు. ఇప్పుడు కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు నిలిపేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలని ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణను కోరుతుంది. అయితే ఈ సర్వీసుల వ్యవహారం సెటిల్ చేసిన తర్వాతనే బస్సులు ప్రారంభించాలని కేసీఆర్ అంటున్నారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ అధికారులకు సూచించారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్ సర్వీస్ లను నడపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకె చేప్పినా... ఈ వ్యవహారం తేలాకనే సర్వీసులు మొదలుపెట్టాలని అన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల నిర్వహణకు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయా రాష్ట్రాల సీఎస్, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ బుధవారం నుంచి సంప్రదింపులు జరుపుతారు.
అంతర్రాష్ట్ర సర్వీసుల పునఃప్రారంభం సందర్భంగా ‘రూట్ టు రూట్’ పద్ధతిన బస్ సర్వీసులు నడుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. విజయవాడ, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాలకు బస్సులను నడిపేందుకు తెలంగాణ ప్రయత్నిస్తుందన్నమాట. మరి ఈ వాదనపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.