హాంకాంగలో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. చైనా తీసుకున్న నేరస్తుల అప్పగింతకు సంబంధించిన బిల్లు బిల్లును వ్యతిరేకిస్తూ 53 మంది పౌరులు ఆందోళనలకు దిగడంతో హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు 36 మంది పురుషులు, 17 మంది మహిళలను ఒక్కచోట చేరినందుకు అదుపులోకి తీసుకున్నట్లు హాంకాంగ్ పొలీసులు వెల్లడించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను అతిక్రమించినందుకే నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం. నేరస్తుల అప్పగింతకు సంబంధించిన బిల్లుపై చైనా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గతేడాది హాంకాంగ్లో నిరసనలు మిన్నంటాయి.
ఈ బిల్లుతో హాంకాంగ్లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో హక్కుల కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది.అయితే ఇచ్చిన మాటను చైనా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని పేర్కొంటూ గత ఏడాది చేపట్టిన ఆందోళనలకు ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో మంగళవారం మరోసారి నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసే విధంగా ఉన్న చైనా జాతీయ భద్రతా చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ముందుకు కదులుతుండటం ఇప్పుడు డ్రాగన్ కంట్రీని కలవరపాటుకు గురి చేస్తోంది.
వాస్తవానికి మిగతా చైనా నగరాలతో పోలిస్తే హాంకాంగ్ చాలా భిన్నం. హాంకాంగ్ 150 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో ఉంది. 1842లో హాంకాంగ్ ద్వీపాన్ని చైనా బ్రిటన్కు అప్పగించింది. ఆ తర్వాత, 1898లో 'న్యూ టెరిటరీస్'గా పిలిచే భూభాగాన్ని కూడా 99 సంవత్సరాల పాటు చైనా, బ్రిటన్కు లీజుకు ఇచ్చింది. అయితే హాంకాంగ్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటూ స్థానిక పౌరహక్కుల ఉద్యమ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాద నాయకులను అనర్హులను చేస్తూ తీసుకువచ్చిన ఆదేశాలను అందుకు ఉదాహరణలుగా చూపుతున్నాయి. అనధికారిక ఆంక్షలను, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని కళాకారులు, రచయితలు, పాత్రికేయులు చెబుతున్నారు.