మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే ప్రశ్నలో ఇప్పటికి సరైన సమాధానం లేదు.. రాలవని కొందరంటే, రాలుతాయనే వారు కూడా ఉన్నారు.. అలాంటివే కొన్ని కొన్ని ప్రశ్నలు ఇప్పటికి ఒంటరిగానే మిగిలి ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ఒకటి.. అదేమంటే.. ప్రపంచాన్ని కరోనా కుమ్మేస్తుందన్న విషయం తెలిసిందే.. దీన్ని సమూలంగా నాశనం చేయాలని ఎందరో శాస్త్రజ్ఞులు కంకణం కట్టుకుని రాత్రిపగలు అనేది మరచిపోయి శ్రమిస్తున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో మూఢనమ్మకాలు కూడా ఆచరించేవారు ఉన్నారు.. నమ్మకం అనేది మనిషికి బలం అయితే.. మూఢనమ్మకం అనేది బలహీనత.. ఈ బలహీనతే మనిషిచేత చేయకూడని పనులను చేయిస్తుంది..
ఇకపోతే కరోనాకు మందులేదు అనేది అందరికి తెలిసిందే.. ఇది రాకుండా ఉండాలంటే దినచర్యలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో కరోనా రాకుండా శాంతి పూజల పేరిట 400 గొర్రెలను బలి ఇచ్చిన ఉదంతం వెలుగుచూసింది. ఆ వివరాలు తెలుసుకుంటే.. చంద్వారా బ్లాక్ పరిధిలో గల ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో కరోనాను శాంతింప చేయడానికంటూ పూజలు నిర్వహించి, కోళ్లతో పాటు 400 గొర్రెలను బలిచ్చారట. వీరిపిచ్చి గానీ కరోనాకు జంతువులను బలిస్తే శాంతిస్తుందంటే ఈ ప్రపంచం మొత్తం జంతువుల రక్తంతో నిండిపోతుంది.. ఇక దేశంలో ప్రతి మూల టెక్నాలజీ వ్యాపిస్తుంది అని చెప్పుకుంటున్న కొందరు ఈ విషయంలో ఎలాంటి సమాధానం చెబుతారో మరి..
నిజానికి ఇలాంటి ఆచారాలను ప్రోత్సాహించే వారి విషయంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని వీరిలో సామాజిక సృహ కలిగించాలి.. వాస్తవాలకు దగ్గరగా జీవించేలా చైతన్యం తీసుకు రావాలి. కరోనా నుండి తమ గ్రామానికి విముక్తి కలుగుతుందని గ్రామ ప్రజల్లో ఉన్న నమ్మకాలను పాతరవెయ్యాలి.. ఇకపోతే కోడెర్మా జిల్లాలో ఈ కార్యక్రమం ఎవరు నిర్వహించారనేది ఇంకా వెల్లడి కాలేదట, అంతే కాకుండా ఈ వేడుకలో గొర్రెలను బలిచ్చే సమయంలో సామాజిక దూరం పాటించాలి అనే నియమాన్ని కూడా ఉల్లంఘించారట. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు దీనికి మూలకారణం ఎవరు అనేది గుర్తించే పనిలో ఉన్నారట..